ముఖ్య వార్తలు
ప్రకృతి ఒడిలో ప్లాస్టిక్ విషం: పర్యాటకుల నిర్లక్ష్యం మరియు పరిశ్రమల వ్యర్థాలతో అడవులు కాలుష్య కూపాలుగా మారుతున్నాయి.
మూగజీవాల మృత్యుఘోష: ప్లాస్టిక్ వ్యర్థాలను తిని మృత్యువాత పడుతున్న అటవీ జంతువులు.
అంతరించిపోతున్న జీవవైవిధ్యం: భూగర్భ జలాలు కలుషితమై వృక్ష సంపదకు ముప్పు.
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ప్రత్యేక కథనం: పచ్చని వనాలపై పెరుగుతున్న కాలుష్యపు నీడ భూమికి ఊపిరితిత్తుల లాంటి అడవులు రోజురోజుకూ తీవ్ర అపరిశుభ్రతకు గురవుతున్నాయి. ఒకప్పుడు స్వచ్ఛమైన గాలికి, కాలుష్యం లేని వాతావరణానికి నిలయంగా ఉన్న మన వనాంచలాలు.. నేడు ప్లాస్టిక్, గాజు సీసాలు, పారిశ్రామిక రసాయన వ్యర్థాలకు నిలయాలుగా మారుతున్నాయి. మానవ తప్పిదాల వల్ల ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన అటవీ సంపద సర్వనాశనం అవుతోంది.
1. పర్యాటకుల నిర్లక్ష్యం – ప్లాస్టిక్ మహమ్మారి
అడవులను సందర్శించడానికి వెళ్తున్న పర్యాటకులు నిబంధనలను విస్మరించి ప్లాస్టిక్ కవర్లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ క్యాన్లు, తదితర వ్యర్థాలను ఇష్టానుసారంగా పడేస్తున్నారు. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు వందల ఏళ్లయినా కుళ్ళిపోకపోవడం వల్ల నేల స్వభావం పూర్తిగా దెబ్బతింటున్నది.
2. మూగజీవాల ప్రాణాలకే ముప్పు
అడవుల్లో పడేస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాలను, మిగిలిపోయిన ఆహార పదార్థాలను తినడానికి వన్యప్రాణులు ఆకర్షింపబడుతున్నాయి. ఆహారంతో పాటు ప్లాస్టిక్ ను కూడా తినడం వల్ల మూగజీవాల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటోంది. ఎన్నో జింకలు, ఏనుగులు, చిరుతలు మరియు ఇతర అటవీ జంతువులు కడుపులో ప్లాస్టిక్ నిండిపోయి దారుణంగా మృత్యువాత పడుతున్నాయి.
3. జలవనరుల కాలుష్యం
అడవుల్లో ప్రవహించే సెలయేర్లు, వాగులు మరియు చెరువులు ప్లాస్టిక్ మరియు గాజు సీసాలు రసాయన వ్యర్థాల కారణంగా కలుషితమవుతున్నాయి. ఈ విషపూరితమైన నీటిని తాగడం వల్ల అడవి జంతువులు వింత వ్యాధులు బారిన పడుతున్నాయి.
4. అటవీ అగ్నిప్రమాదాలకు కారణం
పర్యాటకులు నిర్లక్ష్యంగా పడేసి వెళ్లే గాజు సీసాలు (Glass bottles) ఎండవేడికి లెన్స్ లా పనిచేసి, ఎండుగడ్డిపై మంటలు అంటుకునేలా చేస్తున్నాయి. దీనివల్ల వేలాది ఎకరాల అటవీ సంపద, అరుదైన వృక్షజాలం బూడిదైపోతోంది. మరియు సీసాలు పగలకొట్టడం వల్ల తోటి పర్యాటకులకీ ప్రమాద ఇబ్బందులు కలుగుతున్నాయి.
సమస్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలు
“అడవులను రక్షించుకోవడం అంటే మన భవిష్యత్తును కాపాడుకోవడమే. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత.”
కఠిన నిబంధనలు: అడవుల్లోకి ప్లాస్టిక్ మరియు గాజు వస్తువులను తీసుకువెళ్లకుండా చెక్పోస్టుల వద్దే కఠిన తనిఖీలు చేపట్టాలి.
భారీ జరిమానాలు: అడవుల్లో వ్యర్థాలను పడేసే వారికి మరియు పర్యావరణానికి హాని కలిగించే వారికి భారీ జరిమానాలు విధించాలి.
స్వచ్ఛతా అభియాన్: అటవీ శాఖ ఆధ్వర్యంలో తరచూ స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించి, పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించాలి.
అవగాహన కార్యక్రమాలు: పాఠశాలలు, కళాశాలలు టూరిస్ట్ సంస్థలు ట్రావెలర్ యాజమాన్యాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని ప్రభుత్వ శాకల ఉద్యోగులు టాక్సీ వాహన యాజమాన్యాలు హోటల్స్ మరియు ప్రజల్లో అటవీమరియు జలపాతాల పరిరక్షణపై విస్తృతమైన ప్రచార అవగాహన కల్పించాలి. యర్ర నాగరాజు రెడ్డి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పవర్ ప్రతినిధి 9848515889, 9160591108