POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 27 August 2026, 6:43 pm Posted by : POLITICAL POWER

అనుమతుల్లేని రైస్‌మిల్లుపై అధికారుల కొరడా

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 27 2026: పెద్దమందడి మండలం మోజర్ల సమీపంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న రైస్‌మిల్లు షెడ్డుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. సర్వే నంబర్‌ 327లో చాముండి రైస్‌మిల్లు నిర్మాణాన్ని చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు తీసుకోకుండానే పనులు చేపట్టినట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైంది. దీంతో మిల్లు యాజమాన్యానికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులకు యాజమాన్యం స్పందించకపోవడంతో తదుపరి చర్యలకు అధికారులు సిద్ధమయ్యారు. పంచాయతీ కార్యదర్శి ఫిర్యాదు మేరకు ఎమ్మార్వో మల్లికార్జున్, ఎంపీడీవో పరిణితి, ఎస్సై జలంధర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయంతో అనుమతులు లేకుండా నిర్మించిన షెడ్డును కూల్చివేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… ప్రభుత్వ నిబంధనలు, అనుమతులను పాటించకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్‌లోనూ అనధికార నిర్మాణాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.