పొలిటికల్ పవర్,మణుగూరు, సెప్టెంబర్ 9:
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అర్హులైన పేదలకు మొండిచేయి చూపుతూ అనర్హులకు పెద్దపీట వేస్తున్నారని గోండ్వానా సంక్షేమ పరిషత్ (GSP) రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ ఆరోపించారు.
బుధవారం మణుగూరు మండలం కూనవరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాని లబ్ధిదారులను ఆయన కలిసి మాట్లాడారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు.
అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామానికి చెందిన తాటిగౌరీ.. భర్త, ఇద్దరు పిల్లలతో పూరి గుడిసెలో దయనీయంగా జీవనం సాగిస్తున్నారని, అలాంటి నిరుపేదకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. ఇది అధికారుల తప్పిదమా? లేక స్థానిక ఎమ్మెల్యే తప్పిదమా? అని ప్రశ్నించారు.
అదేవిధంగా కూనవరం గ్రామంలో ఒకే ఇంట్లో నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయని, పక్కనే ఖాళీ స్థలం ఉన్నా మడకం నాగమణి అనే లబ్ధిదారుకు ఇల్లు మంజూరు చేయలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు దరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా స్పందన లేదని లబ్ధిదారులు తమ దృష్టికి తెచ్చారని తెలిపారు.
గతంలో తాను స్వయంగా దరఖాస్తు ఫారాలతో కలిపి ఎమ్మెల్యేకు మెమోరాండం ఇచ్చినా ఫలితం లేదన్నారు. ఫేజ్-1, ఫేజ్-2లో కూడా అర్హులకు ఇళ్లు మంజూరు చేయలేదని విమర్శించారు.
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రంలో పూరి గుడిసె అనే ఆనవాలు లేకుండా అందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారని, కానీ పినపాక నియోజకవర్గంలో మాత్రం నిరుపేదలకు న్యాయం జరగడం లేదని పాయం సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.