పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జిల్లా ఆదివాసీ నాయకులు సోయం వీరభద్రం
పొలిటికల్ పవర్,అశ్వారావుపేట, సెప్టెంబర్ 5:
అశ్వారావుపేట నియోజకవర్గం అశ్వారావుపేట మండలం నేమలిపేట గ్రామానికి చెందిన అశ్వారావుపేట జేఏసీ ఆదివాసీ నాయకుడు పాయం దుర్గారావు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఆదివాసీ సమాజానికి తీరని లోటని జిల్లా ప్రముఖ ఆదివాసీ నాయకులు సోయం వీరభద్రం అన్నారు.
శుక్రవారం నేమలిపేట గ్రామంలోని పాయం దుర్గారావు స్వగ్రామానికి చేరుకున్న సోయం వీరభద్రం, పలువురు జిల్లా ఆదివాసీ నాయకులతో కలిసి దుర్గారావు పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి ఆదివాసీ సమాజం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.
ఈ సందర్భంగా సోయం వీరభద్రం మాట్లాడుతూ.. ఆదివాసీ హక్కుల పరిరక్షణ, సమాజ అభ్యున్నతి కోసం పాయం దుర్గారావు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆదివాసీ సమస్యలపై నిరంతరం స్పందిస్తూ ప్రజల పక్షాన నిలిచిన నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. ఆయన మృతి కుటుంబ సభ్యులకే కాకుండా ఆదివాసీ సమాజానికి కూడా తీరని లోటని పేర్కొన్నారు. దుర్గారావు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం సర్పంచ్ పునెం కృష్ణ, పునెం వీరభద్రం, పాయం రవివర్మ, ధారబోయిన రమేష్, బండారు సూర్యనారాయణ, తెల్లం రామారావు, కంగాల ఆదినారాయణ, మడకం ఆంధ్రయ్య, పద్దం విజయలక్ష్మి తదితర ఆదివాసీ నాయకులు పాల్గొని పాయం దుర్గారావుకు నివాళులర్పించారు.