POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 4:26 pm Posted by : POLITICAL POWER

ఎస్‌ఐఆర్‌పై గ్రామసభ నిర్వహించిన తహసీల్దార్ మల్లికార్జున్ 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 11 2026: పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్‌పై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ గ్రామసభకు తహసీల్దార్ మల్లికార్జున్ హాజరై ఎస్‌ఐఆర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలను గ్రామస్థులకు వివరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మల్లికార్జున్ మాట్లాడుతూ… ఎస్‌ఐఆర్‌కు సంబంధించి ప్రజలు తమ వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్లు, ఇతర వివరాల్లో ఏమైనా తప్పులు లేదా మార్పులు ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలు సక్రమంగా నమోదయ్యేలా అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా 52 మంది వ్యక్తులకు నోటీసులు అందజేసినట్లు తెలిపారు. వారికి నోటీసులు అందించిన అనంతరం, సంబంధిత వ్యక్తులు సమర్పించిన సరిపడే ధ్రువపత్రాలను పరిశీలించి, వాటిని నమోదు చేసి అప్‌లోడ్ చేసినట్లు వెల్లడించారు. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ప్రజలు తమకు సంబంధించిన వివరాలు, ధ్రువపత్రాలను సక్రమంగా సమర్పించి అధికారులకు సహకరించాలని సూచించారు. గ్రామసభలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గ్రామస్థులకు అవగాహన కల్పించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా అధికారుల సూచనలను పాటించాలని తహసీల్దార్ మల్లికార్జున్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెంటయ్య, పెద్దమందడి, ఖిల్లా ఘణపురం మండలాల మార్కెట్ యార్డు ఉపాధ్యక్షులు కొత్తకాపు వెంకటేశ్వర్‌రెడ్డి, పొన్నూరు శ్రీనివాస్‌రెడ్డి, జానకిరాములు, సుదర్శన్, నిరంజన్, రాజశేఖర్‌శెట్టి, బూత్ స్థాయి అధికారులు సువర్ణ, జ్యోతి, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆర్‌ఐ శంకర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.