POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 9:35 pm Posted by : POLITICAL POWER

ఐఐటీ -జెఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా 356వ ర్యాంక్ సాధించిన గురుకుల విద్యార్థి

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 13 2026: జాతీయ స్థాయి ప్రతిష్టాత్మకమైన ఐఐటీ -జెఈఈ మెయిన్స్ పరీక్షలో ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల విద్యార్థి ఇస్లావత్ యశ్వంత్ ఆల్ ఇండియా 356వ ర్యాంక్ సాధించి ప్రతిభ చాటాడు. ఈ విషయాన్ని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖాదర్ జైలాని ఒక ప్రకటనలో తెలిపారు. బల్మూరు మండలం అంబగిరి గ్రామానికి చెందిన ఇస్లావత్ సక్రు, ఉమా దంపతుల కుమారుడు యశ్వంత్ ఈ ఘనత సాధించడంతో పాటు ఐఐటీ మద్రాస్‌లో సీటు పొందడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని, యశ్వంత్ విజయం అందుకు నిదర్శనమని ప్రిన్సిపాల్ అన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య, అధ్యాపకుల మార్గదర్శకత్వం, విద్యార్థి పట్టుదల కలిసి ఈ విజయానికి కారణమయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన విద్యార్థి యశ్వంత్‌ను కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఘనంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థి సాధించిన ఈ ఘనతతో కళాశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి గుర్తింపు లభించిందని పేర్కొన్నారు.