Date of Publish : 09 September 2026, 7:27 amPosted by : POLITICAL POWER
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఆందోళన
420 హామీలు, ఆరు గ్యారంటీల అమలు ఏదీ? –బీఆర్ఎస్ నాయకుల డిమాండ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 10 2026:పెద్దమందడి మండలం బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశాల అనుసారం కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వెయ్యి రోజుల పాలన పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను తక్షణమే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు.పెద్దమందడి మండలంలో రైతులు సాగు చేసిన పంటలు సాగునీరు అందక ఎండిపోతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేశారని, ప్రస్తుతం పంటలకు నీరు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మండలంలోని రైతులకు తక్షణమే సాగునీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రైతుల తరఫున మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీలను అమలు చేయడంతో పాటు పెద్దమందడి మండలంలోని రైతులకు వెంటనే సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రఘుపతి రెడ్డి, మండల అధ్యక్షుడు వేణు, వెంకట్ రెడ్డి, నాగేంద్రం, రామేశ్వర్ రెడ్డి, మనిగిళ్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, వెల్టూర్ సర్పంచ్ అశోక్, గట్టు సతీష్, రఘువర్ధన్ రెడ్డి,మలక్ సురేష్, బలీదు పల్లి అంజి, వివిధ గ్రామాల మాజీ సర్పంచులు మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.