POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 7:35 pm Posted by : POLITICAL POWER

కిష్టారం శివారులో కత్తులతో దాడి.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కొబ్బరి బొండాలు నరికే కత్తులతో భార్యాభర్తల దాడి.. నిందితులు పరార్

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 22 2026: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని కిష్టారం గ్రామ శివారులో కొబ్బరి బొండాలు నరికే కత్తులతో భార్యాభర్తలు దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరువూరు మండలం పరిధిలోని ఓ గ్రామానికి చెందిన నాగమణి, హనుమంతరావు సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామ సమీపంలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కిష్టారం ఎస్సీ కాలనీకి చెందిన గ్రామ పెద్దలు మారోజు నాగేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావు అక్కడికి వెళ్లి, ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో నాగమణి, హనుమంతరావు అనే భార్యాభర్తలు కలిసి మారోజు నాగేశ్వరరావు, నక్క వెంకటేశ్వరరావుపై కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాడికి పాల్పడిన నాగమణి, హనుమంతరావు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, కొత్తగూడెంకు చెందిన సోని అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై వీఎం బంజర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.