పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ దినపత్రిక మరియు పొలిటికల్ న్యూస్ నైన్ టీవీ తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ మంగళగిరి నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో టౌన్ హాల్ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని చిల్లపల్లి కళ్యాణ మంటపంలో జరిగిన ఈ సమావేశానికి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదనమోహన్తో పాటు రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ,నియోజకవర్గ స్థాయి వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మహిళా నాయకురాళ్లు, సీనియర్ నేతలు, వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. దొంతిరెడ్డి వేమారెడ్డి మాట్లాడుతూ… “2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, రైతు భరోసా, మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి లాంటివి అమలు కాకుండా రెండేళ్లు గడిచిపోయాయి. ఇది ప్రజలకు చేసిన వెన్నుపోటు కాదా? మంగళగిరిలో ఒక్క అభివృద్ధి పని కూడా ముందుకు కదల్లేదు. జగనన్న పాలనలో జరిగిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గడపకూ తీసుకెళ్తాం” అని విమర్శించారు.