పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఏన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 12 2026: హైదరాబాద్లోని ఛత్రినాక చౌరస్తా నుంచి బోయిగూడ వైపు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి, రహదారి విస్తరణ పనులు చేపట్టాలని తెలంగాణ ఉద్యమకారుల పోరం కన్వీనర్ గడ్డమీది హరినాథ్ గౌడ్ బిఏ కోరారు. ఛత్రినాక చౌరస్తా మీదుగా ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగిస్తుంటారు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్, కందికల్ రోడ్డు, లాల్ దర్వాజా, గౌలిపుర, రాజన్నబౌలి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గం కావడంతో ఈ ప్రాంతంలో తరచూ తీవ్రమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోంది. ట్రాఫిక్ స్తంభించడంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. రహదారి మధ్యలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాల కారణంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, విద్యుత్ భద్రతపరంగా కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని హరినాథ్ గౌడ్ పేర్కొన్నారు. సంబంధిత CED విభాగానికి GHMC అధికారులు నిధులు కేటాయిస్తే స్తంభాలను తొలగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారని తెలిపారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఛత్రినాక చౌరస్తాలోని ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి, రహదారిని విస్తరించి మెరుగైన రోడ్డు నిర్మించాలని ఆయన కోరారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య కొంతవరకు తగ్గడంతో పాటు ప్రజలకు, వాహనదారులకు సౌకర్యవంతమైన రాకపోకలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ సమస్యపై GHMC South Zone కమిషనర్ వెంటనే చొరవ తీసుకుని సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి చర్యలు చేపట్టాలని గడ్డమీది హరినాథ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.