POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 11 August 2026, 5:36 pm Posted by : POLITICAL POWER

ఛత్రినాక–బోయిగూడ రహదారిలో ఇనుప కరెంటు స్తంభాలు తొలగించి రోడ్డు విస్తరించాలి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ – తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ ఆగస్టు 11 2026: హైదరాబాద్ ఛత్రినాక చౌరస్తా నుంచి బోయిగూడ వైపు వెళ్లే రహదారి మధ్యలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించి, రహదారిని విస్తరించాలని తెలంగాణ ఉద్యమకారుల పోరం కన్వీనర్ గడ్డమీది హరినాథ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఛత్రినాక చౌరస్తా మీదుగా ప్రతిరోజూ భారీ సంఖ్యలో ప్రజలు, వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయని తెలిపారు. ఉప్పుగూడ రైల్వే స్టేషన్, కందికల్ రోడ్డు, లాల్ దర్వాజా, గౌలిపుర, రాజన్నబౌలి తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గాలు ఇక్కడ కలుస్తుండటంతో నిత్యం తీవ్ర ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతోందన్నారు. ట్రాఫిక్ రద్దీ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు సైతం ముందుకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. రహదారి మధ్యలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాల వల్ల ప్రజలకు భద్రతాపరమైన ప్రమాదం కూడా పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇనుప స్తంభాలను తొలగించేందుకు CED శాఖకు GHMC అధికారులు అవసరమైన నిధులు కేటాయించాల్సి ఉందని, నిధులు కేటాయిస్తే స్తంభాలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు చెబుతున్నారని హరినాథ్ గౌడ్ తెలిపారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఛత్రినాక చౌరస్తాలో ఇనుప విద్యుత్ స్తంభాలను తొలగించి, రహదారిని వీలైనంత త్వరగా విస్తరించాలని ఆయన కోరారు. రోడ్డు విస్తరణ పూర్తయితే ట్రాఫిక్ సమస్య గణనీయంగా తగ్గడంతో పాటు ప్రజలకు, వాహనదారులకు సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. ఈ సమస్యపై GHMC సౌత్ జోన్ కమిషనర్ వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి, ఇనుప విద్యుత్ స్తంభాల తొలగింపు మరియు రహదారి విస్తరణ పనులను చేపట్టాలని తెలంగాణ ఉద్యమకారుల పోరం తరఫున గడ్డమీది హరినాథ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.