ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభమైన జర్నలిజం రంగంలో క్షేత్రస్థాయిలో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న జర్నలిస్టుల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని వీడాలని జర్నలిస్టు సంఘాల జాతీయ కార్యదర్శి డిమాండ్ చేశారు. ప్రస్తుత అక్రెడిటేషన్ నిబంధనల వల్ల ఎంతోమంది నిజమైన, కష్టపడే పాత్రికేయులకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి మాట్లాడుతూ.. కేవలం పెద్ద పెద్ద మీడియా సంస్థల్లో పనిచేసే వారికే కాకుండా, గ్రామీణ, మండల స్థాయిల్లో నిరంతరం శ్రమిస్తున్న చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. అక్రెడిటేషన్ కార్డులు లేకపోవడం వల్ల క్షేత్రస్థాయి జర్నలిస్టులు ఉచిత బస్సు పాస్లు, రైల్వే రాయితీలు, ముఖ్యంగా ప్రభుత్వ ఆరోగ్య బీమా (హెల్త్ కార్డ్స్) వంటి కనీస సౌకర్యాలకు దూరమవుతున్నారని గుర్తు చేశారు.ప్రభుత్వానికి ముఖ్య డిమాండ్లు:అక్రెడిటేషన్ నిబంధనలను తక్షణమే సరళీకృతం చేసి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి.అక్రెడిటేషన్ కార్డు లేకపోయినా.. సదరు మీడియా సంస్థ ఐడీ కార్డు లేదా గుర్తింపు పొందిన ప్రెస్ క్లబ్ మెంబర్షిప్ ఆధారంగా ఉచిత వైద్యం, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలి.డిజిటల్ మరియు సోషల్ మీడియా రంగాల్లో వార్తలు సేకరిస్తున్న యువ జర్నలిస్టులను కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిలోకి తీసుకురావాలి.నిజాయితీగా పనిచేసే జర్నలిస్టులను ఆదుకున్నప్పుడే సమాజానికి సరైన సమాచారం అందుతుందని, కాబట్టి సమాచార పౌర సంబంధాల శాఖ (I&PR) మరియు ప్రభుత్వం ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కేసరి ఆక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ జాతీయ కార్యదర్శి మరియు రాజకీయ సామాజిక విశ్లేషకులు కుర్రే రాజేంద్ర రెడ్డి డిమాండ్ చేశారు.