POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 25 August 2026, 6:56 pm Posted by : POLITICAL POWER

ధాన్యం కొనుగోలుకు రైతు ఐడీ తప్పనిసరి

 

బిక్కవోలు: రంగాపురం, ఇల్లపల్లి గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జి. వాణి రైతులకు పలు సూచనలు చేశారు.

ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకోవడంతో వరి పంటకు పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉందని, రైతులు తమ పంటలను ఎప్పటికప్పుడు గమనిస్తూ తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

వరి పంటకు సంబంధించి పంటల బీమా గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినందున రైతులందరూ తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని తెలిపారు.

ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన పంటల నమోదు కార్యక్రమం అన్ని రైతు సేవా కేంద్రాల్లో జరుగుతోందని, రైతులు సెప్టెంబర్ 15వ తేదీలోపు తమ పొలాల్లో సాగు చేస్తున్న పంటలను తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలని సూచించారు. పంటల నమోదును ఆధారంగా చేసుకుని ఎరువుల సరఫరా, ధాన్యం కొనుగోలు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇక ఈ సీజన్ నుంచి ధాన్యం కొనుగోలు, ఎరువుల సరఫరాకు రైతు ఐడీని తప్పనిసరి చేయనున్నట్లు వ్యవసాయ అధికారి వెల్లడించారు. రైతులందరూ తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి APFRలో నమోదు చేసుకుని రైతు ఐడీ పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఈఓ కే. శ్రీనివాసు, వీఏహెచ్ రామకృష్ణ, వీఏఏ దుర్గాప్రసాద్, రైతులు పాల్గొన్నారు.