POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 September 2026, 10:41 pm Posted by : POLITICAL POWER

నేర సమీక్ష సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్

*గంజాయి సరఫరా, సైబర్ నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు నివారణపై ప్రత్యేక దృష్టి పట్టాలి*

పొలిటికల్ పవర్ ప్రతినిధి  ఖమ్మం

గంజాయి వినియోగించే అవకాశం ఉన్న నిర్మానుష ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, ఖాళీ ప్రదేశాలు, పాడుబడిన భవనాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.

పోలీస్ అధికారులతో పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నిర్మానుష ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ గంజాయి వినియోగం, విక్రయాలు, సరఫరాకు పాల్పడే వారిని గుర్తించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన వ్యక్తులను గుర్తించి, వారి నెట్‌వర్క్‌ను ఛేదించడంతో పాటు వినియోగదారులను కూడా గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడేందుకు నిరంతర నిఘా, తనిఖీలు, అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు.

సైబర్ నేరాల నియంత్రణకు సమర్థవంతమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని,

సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి, నేరాల వెనుక ఉన్న మొత్తం నెట్‌వర్క్‌ను ఛేదించేలా దర్యాప్తు చేపట్టాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైన బాధితుల నుంచి ఫిర్యాదులు అందిన వెంటనే స్పందించి, బ్యాంకులు–ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ మోసపోయిన నగదును వీలైనంత త్వరగా ఫ్రీజ్ చేయించి బాధితులకు తిరిగి అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, ఓటీపీ మోసాలు, ఫేక్ లింకులు, సోషల్ మీడియా మోసాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి, ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్‌రూట్ డ్రైవింగ్, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వినియోగించకపోవడం వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

ప్రధాన రహదారులు, జంక్షన్లు, ప్రమాదకర మలుపుల వద్ద నిరంతర నిఘా, వాహన తనిఖీలు చేపట్టాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు.