జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
ఎల్నినో ప్రభావం, ప్రత్యామ్నాయ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కడప జిల్లా ప్రతినిధి: ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని… “ఎల్నినో” వాతావరణ మార్పులు, ప్రత్యామ్నాయ చర్యలపై.. రైతులు, ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభాభవన్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి.. జేసీ డా. నిధి మీనా తోకలిసి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో జిలా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పిజిఆర్ఎస్ వ్యవస్థపై అధికారులు పారదర్శకంగా వ్యవహరిస్తూ.. ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. ప్రజల్లో పీజీఆర్ఎస్ ద్వారా పరిష్కరించిన ఫిర్యాదులపై ప్రజల అభిప్రాయం ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అలాగే ప్రజలు తమ ఫిర్యాదుల స్థితిగతులను టోల్ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. తహసీల్దార్లు, శాఖాధిపతులు, పీజీఆర్ఎస్ సిబ్బంది ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.
ఎల్ నినో ప్రభావంపై ప్రజల్లో అవగాహన పెంచాలి..
ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ చర్యలు, ఈ ఖరీఫ్ సీజన్లో ప్రత్యామ్నాయ సాగు విధానాలపై జిల్లా ప్రజలు, రైతుల్లో అవగాహన పెంచాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. వాతావరణ మార్పులు అనుగుణంగా పంటల సాగు, ప్రకృతి వ్యవసాయ విధానాలు, సేంద్రియ ఎరువుల వినియోగం, భూగర్భ జలాల సంరక్షణ, భూతాపాన్ని తగ్గించే చర్యలు, సాగు మరియు తాగునీటి పొదుపు వంటి అంశాలపై గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని రైతులు, ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. ఇందుకోసం నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో మల్లికార్జునుడు, జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, ఎస్డీసీ వెంకటపతి, డిప్యూటీ కలెక్టర్లు జాన్ ఇర్విన్, రంగస్వామి, శివ రామిరెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.