POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 6:43 pm Posted by : POLITICAL POWER

పూలే దంపతుల సేవలను స్మరించుకునేలా హైదరాబాద్ నడిబొడ్డున విగ్రహాలు: టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఎడిటర్ బి చంద్రశేఖర్ దేశ అభివృద్ధికి విద్యే ప్రామాణికమని విశ్వసించి, సామాజిక అసమానతల నిర్మూలన కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే దంపతుల సేవలు చిరస్మరణీయమని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్ష, సామాజిక అసమానతలను రూపుమాపేందుకు పూలే దంపతులు అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. పెత్తందారీ వ్యవస్థను ఎదురించి, మహిళలు మరియు అణగారిన వర్గాలకు విద్య అందించేందుకు పాఠశాలలను స్థాపించిన మహనీయులు పూలే దంపతులని కొనియాడారు. వారి ఆశయాలను భావితరాలకు చేరవేసేలా హైదరాబాద్ నగర నడిబొడ్డున విగ్రహాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో వెనుకబడిన వర్గాల మహనీయులను గౌరవించుకోవడం సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పూలే దంపతుల వంటి మహనీయుల సేవలను నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. త్వరలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతున్నామని వెల్లడించారు. సామాజిక వర్గాల మధ్య సమతుల్యత, సమాన అవకాశాల కోసం అవసరమైన సోషల్ ఇంజినీరింగ్‌పై అవగాహన ఉన్న ముఖ్యమంత్రి ఉండటంతోనే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతున్నాయని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పూలే దంపతుల ఆశయాలైన విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన పేర్కొన్నారు.