Date of Publish : 27 August 2026, 5:38 pmPosted by : POLITICAL POWER
పేదల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ఇందిరమ్మ ఇళ్లు, ఇంటి స్థలాలు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలి: పిట్టల అర్జున్
పొలిటికల్ పవర్, ఆగస్టు 27,దమ్మపేట: ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడంతో పాటు స్థానిక ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ డిమాండ్ చేశారు. గురువారం దమ్మపేటలో ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు.ఈ సందర్భంగా పిట్టల అర్జున్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయడంలో ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. ఏ పల్లెకు వెళ్లినా నివాస స్థలాలు, విద్య, వైద్యం తదితర మౌలిక సమస్యలపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. పాలకులు మారుతున్నా ప్రజల మౌలిక సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేనిపక్షంలో గత పాలకులకు పట్టిన గతే ప్రస్తుత ప్రభుత్వానికి పడుతుందని హెచ్చరించారు. పేదలకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 31న తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించనున్న ఆందోళనలను విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ మురహరి రఘు, మంగ అంజలి, వజ్రమ్మ తదితరులు పాల్గొన్నారు.