పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే10:
తూర్పుగోదావరిజిల్లా బిక్కవోలు




మండలం బలభద్రపురం గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో ఉన్న పవిత్ర కాలువ రేవును గ్రామానికి చెందిన ఎ వి ఎన్ మూర్తి (కాపుల బుజ్జి) స్వంత ఖర్చులతో శుభ్రపరిచి సేవాభావాన్ని చాటుకున్నారు. గ్రామ మహిళలు, భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించే ఈ రేవు గత కొంతకాలంగా బురద, చెత్త, మురుగుతో దెబ్బతిని వినియోగానికి ఇబ్బందికరంగా మారింది.
రేవులో పేరుకుపోయిన మురుగు, చెత్త కారణంగా మహిళలు, వృద్ధులు రేవులోకి దిగేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడంతో గ్రామ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో బుజ్జి ముందుకు వచ్చి జేసీబీలు, కార్మికులతో రేవులో పేరుకుపోయిన బురదను తొలగించి పూర్తిస్థాయిలో శుభ్రపరిచారు. మహిళలు సురక్షితంగా దిగేలా రేవును పునరుద్ధరించి పరిసరాలను పరిశుభ్రంగా మార్చారు. దీంతో రేవు మళ్లీ పాత వైభవాన్ని సంతరించుకుంది.
ప్రతిరోజూ పూజలకు వచ్చే మహిళలు, గ్రామ పెద్దలు బుజ్జి చేసిన సేవను అభినందించారు. అధికారులు చేయాల్సిన పనిని స్వచ్ఛందంగా ఒక వ్యక్తి తన ఖర్చులతో చేయడం గొప్ప విషయమని కొనియాడారు. గ్రామ యువత కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ ప్రజా సేవకు ఇది ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువలో వ్యర్థాలు వేయకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని, కాలువ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
గ్రామ ప్రజల కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సేవ చేయడం ద్వారా బుజ్జి స్థానికుల ప్రశంసలు అందుకుంటున్నారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ ఘటన మరోసారి చాటి చెబుతోంది.