పొలిటికల్ పవర్ తెలుగు సామాగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్, వనపర్తి జిల్లా బ్యూరో: పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ, నాభి ప్రతిష్ఠ, పోచమ్మ అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమాలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిష్ఠ కార్యక్రమాలకు గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసుల బందోబస్తు
బలిజపల్లి గ్రామంలో నిర్వహించిన బోనాల పండుగ, అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో దైవదర్శనంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పెద్దమందడి ఎస్ఐ జలంధర్ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్ఐ శ్రీనివాస్ శర్మ, కానిస్టేబుల్ రాకేష్, ఖిల్లా ఘనపూర్ మండల కానిస్టేబుల్ స్టీఫెన్, హెడ్ కానిస్టేబుల్ గిరయ్య విధుల్లో పాల్గొన్నారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా క్యూలైన్లను పర్యవేక్షిస్తూ, ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా బందోబస్తు నిర్వహించారు. పోలీసుల సమన్వయంతో భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతిష్ఠ కార్యక్రమాలు విజయవంతంగా ముగియడంతో గ్రామ ప్రజలు, భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.