పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి జూన్ 21 2026 బషీర్: బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ రాష్ట్ర సెక్రటరీగా సైఫుల్లా ఖాన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయవతి నాయకత్వానికి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహం శేఖర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బాధ్యతను పదవిగా కాకుండా కోట్లాది బహుజనుల ఆకాంక్షలకు ప్రతినిధిగా నిలిచే పవిత్ర బాధ్యతగా స్వీకరిస్తున్నానని సైఫుల్లా ఖాన్ పేర్కొన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జాతీయ నాయకత్వానికి, రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహం శేఖర్, సెక్టార్ చీఫ్ కో-ఆర్డినేటర్ అతర్ సింగ్ రావు, మాజీ ఎమ్మెల్సీ సెంట్రల్ కో-ఆర్డినేటర్ సురేష్ ఆర్య, తెలంగాణ స్టేట్ కో-ఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్కృష్ణతో పాటు పార్టీ శ్రేణులందరికీ ధన్యవాదాలు తెలిపారు. భారతరత్న బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ విలువలను, మాన్యవర్ కాన్షిరాం నిర్మించిన బహుజన ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మరింత బలోపేతం చేసేందుకు తన సంపూర్ణ శక్తి సామర్థ్యాలను వినియోగిస్తానని తెలిపారు. సామాజిక న్యాయం, సమానత్వం, స్వాభిమానం, రాజకీయ సాధికారత వంటి బహుజన ఉద్యమ మూల సిద్ధాంతాల సాధన కోసం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్ పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మరింత బలోపేతం చేసి, బహుజనుల స్వరాన్ని శాసనసభలు మరియు ప్రజా వేదికలలో మరింత బలంగా వినిపించే దిశగా అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు. నాయకత్వం అనేది అధికారం కాదని, ప్రజల విశ్వాసాన్ని మోసే బాధ్యత అని, పదవి అనేది హోదా కాదని సమాజానికి సేవ చేసే అవకాశమని సైఫుల్లా ఖాన్ అన్నారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజల ఆశీర్వాదాలు, సహకారం, మార్గదర్శకత్వం ఎల్లప్పుడూ తనకు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జై భీమ్ – జై బీఎస్పీ – జై తెలంగాణ అంటూ తన సందేశాన్ని ముగించారు.