POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 28 August 2026, 1:04 pm Posted by : POLITICAL POWER

బీసీల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు మద్దిశెట్టి సామేలు చొరవ.. తురక నరసింహాతో భేటీ

తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు ప్రజా సమస్యలపై చర్చ

పొలిటికల్ పవర్, అమరావతి, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయానికి వచ్చిన భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డి-నోటిఫైడ్‌, సంచార, పాక్షిక సంచార కమ్యూనిటీల అభివృద్ధి, సంక్షేమ బోర్డు మాజీ సభ్యులు తురక నరసింహాను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు మద్దిశెట్టి సామేలు మర్యాదపూర్వకంగా కలిశారు. తురక నరసింహా ఆహ్వానం మేరకు ఈ భేటీ జరిగినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన పలు ప్రజా సమస్యలపై ఇరువురు చర్చించారు. ముఖ్యంగా తెలంగాణలో బీసీలకు సంబంధించిన సమస్యలు, వారిపై జరుగుతున్నట్లు పేర్కొంటున్న దాడులు, నమోదవుతున్న కేసులు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు మద్దిశెట్టి సామేలు తెలిపారు.

బీసీ వర్గాల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు తాను చేపడుతున్న ప్రయత్నాలను ఈ సందర్భంగా తురక నరసింహాకు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువురు కేంద్ర మంత్రుల దృష్టికి సమస్యలను తీసుకెళ్లిన విషయాన్ని వెల్లడించారు. బీసీల సంక్షేమం, సామాజిక న్యాయం, వారి హక్కుల పరిరక్షణ కోసం సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిపారు.

ఈ సమావేశంలో అమిత్‌ షా యూత్‌ బ్రిగేడ్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షులు కొరస రమేష్‌బాబు, తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా మజ్దూర్‌ సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షులు పలగాని శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.