POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 June 2026, 8:07 am Posted by : POLITICAL POWER

భూగర్భ వారాహి మాత ఆలయంలో ఘనంగా పంచమి వేడుకలు

 

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగుదినపత్రిక జూన్ 06:
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో కొలువై ఉన్న ప్రసిద్ధ భూగర్భ వారాహి మాత ఆలయంలో పంచమి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు తదితర ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కుంకుమ పూజలు, అర్చనలు, సహస్రనామ పారాయణాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో భూగర్భ వారాహి మాత భక్తులకు దివ్య దర్శనమిచ్చి ఆకట్టుకుంది.
వారాహి అమ్మవారికి పంచమి తిథి అత్యంత ప్రీతికరమైన రోజని, ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని అభిషేకాలు, కుంకుమ పూజల్లో పాల్గొనడం ద్వారా విశేష పుణ్యఫలాలు, అమ్మవారి అనుగ్రహం లభిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. కుటుంబ శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, విజయాలు కోరుకుంటూ భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
అతి తక్కువ కాలంలోనే భూగర్భ వారాహి మాత ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని, నిత్యం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. పంచమి సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.