Date of Publish : 09 September 2026, 5:01 pmPosted by : POLITICAL POWER
భూమి కోసం ఏజెన్సీ ఏరియాలో ఆదివాసుల న్యాయ పోరాటం
పత్రాలున్నా పట్టించుకోని అధికారులు
అక్రమ కేసులు ఎత్తివేసి భూమిని అప్పగించాలని డిమాండ్అశ్వారావుపేట పొలిటికల్ పవర్ జాతీయ సమగ్ర తెలుగు దినపత్రిక పీన్9 టీవీ న్యూస్( ఆర్సి కారం వెంకటేష్ ) ములకలపల్లి సెప్టెంబర్ 9: అధికారికంగా పట్టా పాసుపుస్తకాలు, అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ తమ భూమిని అక్రమంగా ఆక్రమించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడం లేదని బాధితుడు మడకం నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన తమ గోడును వెళ్లబోసుకున్నారు.బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలపల్లి మండల పరిధిలోని ముత్త్యాలంపాడు గ్రామానికి చెందిన మడకం బాయమ్మ పేరు మీద సర్వే నం. 626/279 లో 2 ఎకరాల 32 గుంటల విస్తీర్ణంతో పాటు మొత్తం 10 ఎకరాలకు సంబంధించిన పట్టా పాసుపుస్తకాలు ఉన్నాయి. ప్రస్తుతం 7 ఎకరాల భూమి సాగులో ఉండగా, మిగిలిన 3 ఎకరాల భూమిని ఎస్.కె. మౌలాలి, ఆయన కుమారుడు ఎస్.కె. గౌస్, సహోదరుడు ఎస్.కె. హైమత్ ప్రభుత్వ భూమి అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి (కానిస్టేబుల్) సైతం పౌర వస్త్రాల్లో వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆరోపించారు. అధికారుల చుట్టూ తిరిగినా శూన్యం: ఈ భూమి విషయమై ఎఫ్-లైన్ సర్వే కోసం దరఖాస్తు చేసినా, ప్రజావాణిలో కలెక్టర్, ఎంపీడీవో, ప్రజా దర్బార్లో, ఆర్డీవో, జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోలకు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదని బాధితుడు వాపోయారు. మరోవైపు ములకలపల్లి ఎస్సై తమపై అక్రమ కేసులు బనాయిస్తూ, తహసీల్దార్ వద్ద నుంచి ఆర్డర్ తీసుకురావాలని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులైన మడకం నరసింహారావు, పర్షిక రాంబాబు, ఈసం వసంత్లపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, తహసీల్దార్ సమక్షంలో వెంటనే సర్వే నిర్వహించి భూమిని అప్పగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల ప్రధాన కార్యదర్శి మడకం రవి, నాయకులు మడివి అరుణాద్, మిడియం విజయ్, మిడియం హరీష్, సున్నం భరత్, కుంజా సాయి, సుహాసిని, సున్నం భద్రమ్మ, సోయం వెంకటమ్మ తదితరులు పాల్గొని బాధితులకు మద్దతు పలికారు.