సమావేశంలో ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యంపై అవగాహన
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 14 2026: పెద్దమందడి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల–మోజర్లలో గురువారం బడిబాట కార్యక్రమం మరియు తల్లిదండ్రుల సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మద్దిగట్ల, మోజర్ల గ్రామాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి బడిబాట ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను వినియోగించుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మద్దిగట్ల సర్పంచ్ రాములు యాదవ్, మోజర్ల సర్పంచ్ చంద్రశేఖర్, మద్దిగట్ల ఉప సర్పంచ్ రవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు, ఉపాధ్యాయులు పి. వెంకటస్వామి, గద్వాల కృష్ణయ్య, ఎం. పుల్లయ్య, కే. మధుసూదన్, ఎన్. వెంకటస్వామి, ఏ. వెంకటస్వామి, చిన్నారెడ్డి, మోజర్ల పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎస్. వరప్రసాద్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వారోత్సవాల భాగంగా బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం విస్తృతంగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు.
వచ్చే విద్యా సంవత్సరంలో విద్యార్థులకు 21 రకాల వస్తువులతో కూడిన కిట్, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజన పథకం వంటి సౌకర్యాలు అందించనున్నట్లు చెప్పారు.
ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. గత రెండు సంవత్సరాలుగా మద్దిగట్ల–మోజర్ల ఉన్నత పాఠశాల పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిందని పేర్కొన్నారు. డిజిటల్ తరగతుల ద్వారా నిష్ణాతులైన ఉపాధ్యాయులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా బోధన అందిస్తున్నారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు చెల్లించి తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు లభిస్తున్నాయని అన్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలలనే ఎంపిక చేయాలని సూచించారు.