POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 2:11 pm Posted by : POLITICAL POWER

మద్దిశెట్టి సామెల్‌పై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు: రాజులపాటి ఐలయ్య

పొలిటికల్ పవర్,ఖమ్మం, సెప్టెంబర్ 7: ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ మహాకూటమి ఎన్వైసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల ఇన్‌చార్జిగా ఉన్న మద్దిశెట్టి సామెల్‌పై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టడం సరికాదని ఎన్సీపీ పార్టీ గౌరవ రాష్ట్ర సలహాదారు రాజులపాటి ఐలయ్య అన్నారు.

మద్దిశెట్టి సామెల్ నుంచి మాలమంటి వెంకటరత్నం, కూరపాటి నాగరాజు, నాగవేణి తదితరులు రూ.9,00,000 బ్యాంకు ద్వారా బదిలీ చేయించుకున్నారని, అనంతరం అదే డబ్బుకు సంబంధించి మద్దిశెట్టి సామెల్‌పై తప్పుడు ఆరోపణలతో ఏ.కొండూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై వాస్తవాలను పూర్తిస్థాయిలో విచారించి నిజానిజాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో పార్టీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని 24 మండలాల్లో, ఆరు జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద, అలాగే సంబంధిత పోలీస్ స్టేషన్లలో మాలమంటి వెంకటరత్నం, కూరపాటి నాగరాజు తదితరులపై ఎన్సీపీ పార్టీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు మరియు పోలీసు అధికారులకు ఫిర్యాదులు సమర్పించారు.

మద్దిశెట్టి సామెల్‌పై ఎన్ని ఫిర్యాదులు చేసినా నిజం నిప్పులాంటిదని, అవసరమైతే తెలంగాణ రాష్ట్రంలోని 56 మండలాల నుంచి ప్రజలు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించి నిజానిజాలను నిగ్గు తేలుస్తామని రాజులపాటి ఐలయ్య తెలిపారు.

మద్దిశెట్టి సామెల్‌కు చెల్లించాల్సిన డబ్బులు నిజాయితీగా తిరిగి చెల్లించాలని, లేనిపక్షంలో చట్టపరమైన మార్గాల్లో చర్యలు తీసుకునేలా పార్టీ తరఫున ముందుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు.

పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్క ఎన్సీపీ పార్టీ కార్యకర్తకు రాజులపాటి ఐలయ్య కృతజ్ఞతలు మరియు పాదాభివందనాలు తెలియజేశారు.