POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 6:30 pm Posted by : POLITICAL POWER

మల్లెగుడిపాడు ఎలిమెంటరీ స్కూల్లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసిన ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్

 పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా యం వెంకటేష్ మల్లెగుడిపాడు ఎలిమెంటరీ స్కూల్లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ… దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్ర్యం అనేది కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదని, ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, విద్య, ఉపాధి, సామాజిక న్యాయం అందేలా సమాజాన్ని నిర్మించడమే నిజమైన స్వాతంత్ర్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు నేటి విద్యార్థుల చేతుల్లోనే ఉందని, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదల, దేశభక్తి, మానవతా విలువలను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, కష్టపడి చదివి తమ తల్లిదండ్రులతో పాటు గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు మరింత మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ విద్యాసంస్థలు బలమైన ఆధారంగా నిలుస్తున్నాయని, వాటి అభివృద్ధికి ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఓబులేసు విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, యువత, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారు. “స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని… సమానత్వం, సామాజిక న్యాయం, విద్య, ఉపాధి కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం” అని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పెద్దుల్లపల్లి ప్రభాకర్ పిలుపునిచ్చారు.