17వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా జూలూరుపాడు వెంకటేష్ సెప్టెంబర్ 2 2026: దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని జూలూరుపాడు మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లేళ్ల వెంకటరెడ్డి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా లేళ్ల వెంకటరెడ్డి మాట్లాడుతూ… “ప్రజలే నా కుటుంబం” అనే భావనతో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశారని అన్నారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఆయన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ హయాంలో రైతులకు ఉచిత విద్యుత్, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లు, పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు రీయింబర్స్మెంట్, మహిళల స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేశారని తెలిపారు. ఆయన తీసుకున్న ప్రజా సంక్షేమ నిర్ణయాలు కోట్లాది మంది పేద ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయని లేళ్ల వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించడం, విద్యార్థులకు ఉన్నత విద్యకు అవకాశాలు కల్పించడం, రైతులకు ఉచిత విద్యుత్ అందించడం వంటి నిర్ణయాలు ప్రజల హృదయాల్లో వైఎస్ఆర్కు ప్రత్యేక స్థానం కల్పించాయని పేర్కొన్నారు.
పేదలు, రైతులు, బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని, అందుకే ఆయనను ప్రజలు ఇప్పటికీ “మహానేత” గా ఆప్యాయంగా గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగిస్తూ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోతు మంగీలాల్ నాయక్, వెంగనపాలెం మాజీ ఎంపీటీసీ దుద్దుకూరి మధుసూదన్ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ జనరల్ సెక్రటరీ మోదుగు రామకృష్ణ, మండల ఉపాధ్యక్షుడు లచ్చు నాయక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మంద బాబు, ఉద్యమకారుడు వేల్పుల నరసింహారావు, సేవాదళ్ మండల అధ్యక్షుడు కిషన్, కొలిపాక వెంకటేశ్వర్లు, నర్వనేని పుల్లారావు, రామిశెట్టి నాగేశ్వరరావు, పోతురాజు నాగరాజు, ముదిగొండ వెంకటప్పయ్య తదితర కాంగ్రెస్ పార్టీ మండల సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, పార్టీ కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు, నాయకులు, పెద్దలు పాల్గొని మహానేతకు ఘన నివాళులర్పింaచారు.