– యాంటీ డ్రగ్ సోల్జర్ సర్టిఫికెట్లతో విద్యార్థుల సత్కారం,
– 400 మంది విద్యార్థుల భాగస్వామ్యంతో విజయవంతమైన అవగాహన కార్యక్రమం,
– విజేతల సత్కారంతో పాటు మాదకద్రవ్యాల నిర్మూలన, విద్యార్థినుల భద్రతపై చైతన్యం,
– వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ. బాలాజీ నాయక్,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 14. 2026.
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం ప్రతి విద్యార్థి జీవిత విజయానికి తొలి అడుగు. యువతలో అవగాహన పెరిగితేనే వ్యసన రహిత, సురక్షిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. విద్యార్థినుల భద్రతకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్ సోల్జర్ గా సమాజంలో చైతన్యం తీసుకురావాలని వనపర్తి డీసీఆర్బీ డీఎస్పీ. బాలాజీ నాయక్ అన్నారు. వనపర్తి జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు, అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలన, విద్యార్థినుల భద్రత, మహిళల రక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఈగల్ పార్టీ అవగాహన విభాగం డీఎస్పీ బుచ్చయ్య ఆధ్వర్యంలో అందజేసిన ప్రశంసా పత్రాలు, పతకాలు, యాంటీ డ్రగ్ సోల్జర్ సర్టిఫికెట్లను డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీ నాయక్, ఎస్సై అంజాద్, కళాశాల ప్రిన్సిపాల్ నవీన్, వైస్ ప్రిన్సిపాల్ సంయుక్తంగా విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ. మాట్లాడుతూ మాదకద్రవ్యాలు యువత భవిష్యత్తును, కుటుంబాల ఆనందాన్ని, సమాజ ప్రశాంతతను దెబ్బతీసే మహమ్మారి వంటివని అన్నారు. ఒకసారి వాటికి బానిసైతే విద్య, ఆరోగ్యం, వ్యక్తిత్వం, కుటుంబ బంధాలు, జీవిత లక్ష్యాలన్నీ దెబ్బతింటాయని పేర్కొన్నారు. యువత తమ జీవిత లక్ష్యాలపై దృష్టి సారించి, వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. “యాంటీ డ్రగ్ సోల్జర్’ సర్టిఫికెట్ కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదని, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సమాజంలో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యతకు ప్రతీక అని తెలిపారు. ప్రతి విద్యార్థి తన కుటుంబం, స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కల్పిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థినుల భద్రతపై అవగాహన కల్పిస్తూ, ర్యాగింగ్, ఈవ్టీజింగ్, సైబర్ వేధింపులు లేదా ఇతర వేధింపులు ఎదురైనా భయపడకుండా వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. ప్రభుత్వం అందుబాటులో ఉంచిన 1908 టోల్ ఫ్రీ సేవలను అవసరమైన సమయంలో వినియోగించుకోవాలని వివరించారు. మహిళల భద్రత, యువత సంక్షేమం, మాదకద్రవ్యాల నిర్మూలన కోసం పోలీసు శాఖ నిరంతరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నవీన, వైస్ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, పోలీసు అధికారులు సిబ్బంది 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు.


