POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 12:59 pm Posted by : POLITICAL POWER

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

వనపర్తి రాజీవ్ గాంధీ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: దేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా వనపర్తి రాజీవ్ గాంధీ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ… రాజీవ్ గాంధీ సేవలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని అన్నారు. ప్రజాసేవలోనే తమ జీవితాలను అంకితం చేసిన కుటుంబం ఇందిరా గాంధీ కుటుంబమని, దేశ అభివృద్ధి కోసం ఆ కుటుంబం చేసిన త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించడంలో రాజీవ్ గాంధీ పాత్ర ఎంతో కీలకమని అన్నారు. దేశంలో కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ రంగాల అభివృద్ధికి పునాదులు వేయడం, సాంకేతిక విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడం వంటి అనేక సంస్కరణలు నేటి భారతదేశ అభివృద్ధికి మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యంలో యువతకు మరింత భాగస్వామ్యం కల్పించిన ఘనత రాజీవ్ గాంధీ దేనని అన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. భారతదేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లాలన్న రాజీవ్ గాంధీ దూరదృష్టి నేడు సాకారమవుతోందని, ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు, ఆలోచనలు నేటి తరానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ మాధవి రమేష్, పట్టణ అధ్యక్షులు కదిరె రాములు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వనపర్తి జిల్లా కమిటీ కార్యవర్గం సభ్యులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువకులు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.