POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 6:33 pm Posted by : POLITICAL POWER

*రైతాంగానికి జీవనాధారం అందించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్*

 

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే15:

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని కెనాల్ రోడ్డులో ఉన్న సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికి ఆయన జయంతి సందర్భంగా గ్రామ పెద్దలు, రైతులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ సబ్బేళ్ళ గంగరాజు మాట్లాడుతూ సర్ ఆర్థర్ కాటన్ రైతాంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణం ద్వారా గోదావరి నదీ జలాలను వ్యవసాయానికి వినియోగించేలా చేసి లక్షల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేసిన మహనీయుడు కాటన్ అని అన్నారు. గోదావరి డెల్టా ప్రాంతం నేడు అన్నపూర్ణగా వెలుగొందటానికి ఆయన దూరదృష్టి, కృషి కారణమని పేర్కొన్నారు.
వ్యవసాయ అభివృద్ధి, సాగునీటి విస్తరణ, రైతుల ఆర్థికాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు. కాటన్ నిర్మించిన ఆనకట్టల వల్లే గోదావరి జిల్లాల్లో పంటల ఉత్పత్తి పెరిగి రైతుల జీవనోపాధి మెరుగుపడిందని చెప్పారు. రైతాంగానికి జీవనాధారం కల్పించిన మహానుభావుడిగా సర్ ఆర్థర్ కాటన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు.
భావితరాలకు కూడా ఆయన చేసిన సేవలను తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని, అలాంటి మహనీయుడి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కొవ్వూరి సత్తిరెడ్డి, సబ్బేళ్ళ గంగరాజు, బాపిరెడ్డి, వెంకటరెడ్డి, వెలగల సతీష్ రెడ్డి మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.