పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా–DAPతో అధిక దిగుబడులపై శిక్షణ

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 1 2026: పెద్దమందడి రైతు వేదికలో మంగళవారం రైతు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడులు సాధించే విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయం, నూనెగింజ పంటల ప్రోత్సాహం, నానో యూరియా, నానో DAP వినియోగం, బయో ఫర్టిలైజర్స్ వాడకం తదితర అంశాలపై వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు వివరించారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడే విధంగా సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆంజనేయులు, DAAT సెంటర్ వనపర్తి శాస్త్రవేత్త నవత, పెద్దమందడి వ్యవసాయ అధికారి సైదులు యాదవ్, పెద్దమందడి సర్పంచ్, చిన్నమందడి సర్పంచ్, దొడగుంటపల్లి సర్పంచ్తో పాటు పలువురు రైతులు, రైతు మహిళలు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి
ఈ సందర్భంగా శాస్త్రవేత్త నవత మాట్లాడుతూ… ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ అందిస్తామని తెలిపారు. శిక్షణ పొందిన రైతులకు నేచరల్ ఫార్మర్ సర్టిఫికెట్ అందించేలా చర్యలు తీసుకుంటామని, తద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు అదనపు విలువ కల్పించి రైతులకు మెరుగైన ధర లభించేలా అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.
వేరుశనగ రైతులకు కొత్త రకం విత్తనాలు
వేరుశనగ సాగు చేస్తున్న రైతులకు విశిష్టమైన కొత్త రకం బ్రీడర్ సీడ్ అందించే దిశగా చర్యలు తీసుకుంటామని నవత తెలిపారు. రైతులు ఆ విత్తనాలను సాగు చేసి ఉత్పత్తి చేసిన విత్తనాలను అధిక ధరకు బై-బ్యాక్ చేసే సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ విధానం ద్వారా వేరుశనగ రైతులకు అదనపు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని వివరించారు. రైతులు శాస్త్రీయ సాగు పద్ధతులను అవలంబించి, వ్యవసాయ శాఖ అందిస్తున్న శిక్షణలు, సాంకేతిక సూచనలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.