POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 1:44 pm Posted by : POLITICAL POWER

వనపర్తి జిల్లాలో అవినీతి అధికారులపై నిఘా పెట్టాలి

-బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 12 2026: వనపర్తి జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జెఎసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మహేందర్ నాయుడు మాట్లాడుతూ… జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో ప్రజలు వినతి పత్రాలు ఎన్నో ఇస్తున్న కూడా అధికారులు మాత్రం ప్రజా సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ సక్రమంగా పనిచేయడం లేదన్నారు. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని కార్యాలయాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చూసి అవినీతికి పాల్పడుతున్న అధికారులపై దృష్టి సారించాలన్నారు. ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకు అధికారుల దగ్గరకు వెళ్తే పట్టించుకోవడం లేదని, ముఖ్యంగా ప్రతి శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సామాన్య జనాలను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు ఇస్తేనే పని అవుతుంది లేకపోతే పని చేయమని చెప్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఉద్యోగులు అవినీతికి పాల్పడకుండా ప్రతి శాఖలో ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు చూసి ఫిర్యాదులకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు. అవినీతికి పాల్పడిన ఏ అధికారి అయినా…ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకుండా బిసి పొలిటికల్ జెఎసి ప్రజల తరపున పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఏసిబి అధికారులను కలిసి అవినీతికి పాల్పడుతున్న అధికారులు మరియు ఉద్యోగులపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, వనపర్తి పట్టణ అధ్యక్షులు దేవర శివ పాల్గొన్నారు.