విజయవాడ పశ్చిమలో వైయస్ఆర్ సీపీ క్లస్టర్-5 విస్తృత స్థాయి సమావేశం…
సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్-5 (49, 50, 52, 53 డివిజన్లు) విస్తృత స్థాయి సమావేశం ఆదివారం స్థానిక బ్రాహ్మణ వీధిలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్, మాజీ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వెన్నుపోటు.. పార్టీ వెన్నుపోటు పాలన పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ లో పదవులు పొందిన నాయకులకు గుర్తింపు కార్డులను అందజేశారు
ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేయడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి వెన్నుపోటు పార్టీ..వెన్నుపోటు పాలన పేరిట ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని (డోర్ టు డోర్ క్యాంపెయిన్) విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా వెన్నుపోట్లతోనే నిండిపోయిందని, ఆనాడు పార్టీని లాక్కోవడానికి స్వర్గీయ ఎన్టీఆర్ గారికి ఎలాగైతే వెన్నుపోటు పొడిచారో, ఈనాడు కూటమి ప్రభుత్వంలో మోసపూరిత హామీలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా అదే విధంగా వెన్నుపోటు పొడుస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. గత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రతి మూడు నెలలకొకసారి అర్హులైన వారందరికీ నూతన పెన్షన్లు మంజూరు చేశారని, మహిళల సంక్షేమం కోసం చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి ఎన్నో పథకాలను అమలు చేసి ఆదుకున్నారని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత పాలకులు రెండున్నర సంవత్సరాల తర్వాత మాత్రమే కొత్త పెన్షన్ల దరఖాస్తులంటూ హడావుడి చేస్తున్నారని, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు
ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగే నైతిక హక్కు ఒక్క వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వ వెన్నుపోటు పాలనను, వారి వైఫల్యాలను విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి గడపకూ వెళ్లి ప్రజలకు వివరిస్తామని తెలిపారు. విజయవాడ నగరం సమగ్ర అభివృద్ధి చెందాలంటే వైయస్ఆర్ సీపీతోనే సాధ్యమని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కేడర్ సమష్టిగా పనిచేసి పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక స్థానాలను గెలుచుకుని విజయకేతనం ఎగురవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.