POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 3:56 pm Posted by : POLITICAL POWER

విద్యార్థులపై పోలీసు చర్యలు, కాంగ్రెస్ నేతల అరెస్టులకు నిరసన

ముదిగొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అజ్గర్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులు విద్యార్థుల పట్ల వ్యవహరించిన తీరును ఖండిస్తూ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, డీకే శివకుమార్ తదితర కాంగ్రెస్ నాయకుల అరెస్టులను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మహ్మద్ అజ్గర్ మాట్లాడుతూ… దేశ భవిష్యత్తైన విద్యార్థులు, యువతీ యువకులపై హింసాత్మకంగా వ్యవహరించడం అత్యంత బాధాకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై బలప్రయోగం చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, కేంద్ర ప్రభుత్వం ప్రజల గొంతును అణచివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సెల్ ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.