POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 11:34 am Posted by : POLITICAL POWER

వివాదం తేలేదాకా ఆగలేరా? భూములు అక్కడే ఉంటాయి కదా?

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సూరారం ప్రాంతంలోని సర్వే నంబర్ 105లో ఉన్న ప్రైవేట్ భూమి వివాదానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు భూమి వివాదంలో హైడ్రా ఏర్పాటు చేసిన బోర్డులను 48 గంటల్లో తొలగించాలని ఈ ఏడాది మే 6న హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ, ఆ ఆదేశాలను అమలు చేయలేదని దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “భూమి ఎక్కడికైనా వెళ్లిపోతుందా? వివాదం పూర్తిగా తేలే వరకు ఆగకుండా బోర్డులు ఏర్పాటు చేయడం ఎందుకు?” అంటూ హైడ్రా అధికారుల వ్యవహారశైలిపై కోర్టు ప్రశ్నలు సంధించింది. అలాగే, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించినప్పటికీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ హాజరు కాకపోవడాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. హాజరు నుంచి మినహాయింపు కోరుతూ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని, కనీసం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా హాజరయ్యేందుకు ప్రయత్నించలేదని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వైఖరి కొనసాగితే హైడ్రా కమిషనర్ కెరీర్ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని హైకోర్టు హెచ్చరించింది. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం సహించబోదని స్పష్టం చేసింది.