POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 8:04 am Posted by : POLITICAL POWER

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన.. హామీల అమలేది?

వనపర్తి గాంధీచౌక్‌లో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వంటావార్పు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక/ పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 06 2026: నపర్తి జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని గాంధీచౌక్‌లో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

పెన్షన్లు పెంచాలి.. మహిళలకు రూ.2,500 ఇవ్వాలి

వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితరులకు అందుతున్న పెన్షన్లను పెంచాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్ చేశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. అదేవిధంగా కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి, విద్యార్థినులకు స్కూటీలు తదితర హామీలను కూడా ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

420 హామీలతో ప్రజలను మోసం చేశారు: బీఆర్‌ఎస్‌ నేతలు

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు పలస రమేష్‌ గౌడ్, వనపర్తి మండల అధ్యక్షుడు కే. మాణిక్యం మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అయితే ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తవుతున్నా అనేక హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కేసీఆర్‌ హయాంలో పేదలకు భరోసా: బీఆర్‌ఎస్‌

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పేదలు, వృద్ధులు, వితంతువులు, హెచ్‌ఐవీ బాధితులకు ఆసరా పెన్షన్ల ద్వారా ఆర్థిక భరోసా కల్పించామని నాయకులు పేర్కొన్నారు. 2014 నవంబర్‌ 14న కొత్తూరు మండలంలో ఆసరా పెన్షన్లను ప్రారంభించిన విషయాన్ని వారు గుర్తుచేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో లేని అనేక వర్గాలకు కూడా కేసీఆర్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించిందని తెలిపారు.

వెయ్యి రోజులు గడిచినా హామీలు అమలు కాలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లను మరింత పెంచుతామని, మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తామని, ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీలు ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. అయితే వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీల అమలులో స్పష్టమైన పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఇకనైనా కాలయాపన చేయకుండా వెంటనే అమలు చేయాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించాలని బీఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్ చేశారు. ఈ వంటావార్పు కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, పట్టణ, మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.