POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 7:43 am Posted by : POLITICAL POWER

శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలి

మండపాల నిర్వాహకులకు టేకుమట్ల పోలీసులు సూచనలు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ఎల్ల స్వామి జయశంకర్ భూపాలపల్లి జిల్లా: టేకుమట్ల వినాయక నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని టేకుమట్ల పోలీసులు వినాయక మండపాల నిర్వాహకులకు సూచించారు. టేకుమట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన వినాయక మండపాల నిర్వాహకులతో పోలీస్‌స్టేషన్ ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చిట్యాల సీఐ వై. సతీష్, టేకుమట్ల ఎస్సై జి. అమూల్య పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ… ప్రజలకు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించే విధంగా రహదారులకు అడ్డంగా వినాయక మండపాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. మండపం ఏర్పాటు చేసే స్థలానికి సంబంధించి భూమి యజమాని అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, విద్యుత్‌ వినియోగానికి సంబంధిత అనుమతులు పొందాలని తెలిపారు. ప్రతి వినాయక మండపానికి పోలీసుల ద్వారా ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలని సూచించారు. అలాగే డీజేలు, అధిక శబ్దంతో సౌండ్‌ బాక్సులు వినియోగించవద్దని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, సంతోషకరమైన వాతావరణంలో నిర్వహించాలని కోరారు. విద్యుత్‌ వైర్లు చిన్నారులకు అందకుండా సురక్షిత దూరంలో ఏర్పాటు చేసుకోవాలని, మండపం వద్ద ఎల్లప్పుడూ కనీసం ఇద్దరు సభ్యులు అందుబాటులో ఉండేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

నిమజ్జనంపై ప్రత్యేక సూచనలు

వినాయక నిమజ్జనం రోజున ఉదయం 10 గంటల నుంచే నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించి, సాయంత్రం 4 గంటలలోపు అన్ని వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని పోలీసులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఉత్సవాలను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, వినాయక మండపాల నిర్వాహకులు, యువకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.