POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 4:06 pm Posted by : POLITICAL POWER

“శిరీష మృతిపై నిజాలు నిగ్గు తేల్చాలి.. కుటుంబానికి న్యాయం చేయాలి”

అనుమానాస్పద మృతిపై లోతైన దర్యాప్తు అవసరం: మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

పొలిటికల్ పవర్,ములకలపల్లి, ఆగస్టు 30: ములకలపల్లి మండలం చౌటుగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి యువతి శిరీష హైదరాబాద్‌ తుక్కుగూడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తూ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం పట్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శిరీష మృతిపై కుటుంబ సభ్యుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, అసలు వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు.

శిరీష మృతికి దారితీసిన పరిస్థితులపై లోతైన, సమగ్ర దర్యాప్తు చేపట్టాలని తాటి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఘటనకు ముందు, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించి, మృతికి అసలు కారణాన్ని శాస్త్రీయంగా నిర్ధారించాలని కోరారు. దర్యాప్తులో ఎవరైనా బాధ్యులుగా తేలితే వారిపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఉద్యోగం కోసం స్వగ్రామానికి దూరంగా వెళ్లిన ఓ ఆదివాసి యువతి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని తాటి వెంకటేశ్వర్లు అన్నారు. మహిళలు, ముఖ్యంగా గ్రామీణ, ఆదివాసి ప్రాంతాలకు చెందిన యువతులు ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు వారి భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

శిరీష కుటుంబం ప్రస్తుతం తీవ్ర విషాదంలో ఉందని, ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలవాలని కోరారు. కుటుంబ సభ్యులకు తగిన న్యాయం, అవసరమైన సహాయాన్ని అందించడంతో పాటు ఘటనపై పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని సూచించారు.

శిరీష మృతికి సంబంధించిన ప్రతి అనుమానాన్ని నివృత్తి చేసి, అసలు నిజాలను వెలుగులోకి తీసుకురావాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలని తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.