POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 23 June 2026, 2:22 pm Posted by : POLITICAL POWER

సింగరేణి సుషీ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ మృతి

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ రిపోర్టర్ ఏ హరిబాబు జూన్ 23 2026: సింగరేణి సంస్థ సుషీ క్యాంపులో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామ శివారులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సమాచారం మేరకు, హైదరాబాద్‌కు చెందిన నర్సిరెడ్డి సింగరేణి సంస్థకు చెందిన సుషీ క్యాంపులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని తన గదిలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. గదిలో ఉన్న తోటి ఉద్యోగులు గమనించి వెంటనే అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు నర్సిరెడ్డి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. గుండెపోటే మరణానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సత్తుపల్లి పోలీసులు ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు సత్తుపల్లికి బయలుదేరినట్లు తెలిసింది. విధి నిర్వహణలో ఉన్న సమయంలోనే నర్సిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం సహచర ఉద్యోగులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఆయన మృతికి సింగరేణి ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.