పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజ శేఖర్ జులై 30 2026: హైదరాబాద్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమానానికి శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి ప్రయత్నంలో ల్యాండింగ్ క్లియరెన్స్ లభించలేదు. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వస్తున్న ఈ విమానం ల్యాండింగ్కు సిద్ధమవుతున్న సమయంలో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోవడంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు భద్రతా దృష్ట్యా ల్యాండింగ్కు అనుమతి ఇవ్వలేదు. దీంతో పైలట్ విమానాన్ని తిరిగి గాల్లోకి తీసుకెళ్లి సుమారు 20 నిమిషాల పాటు విమానాశ్రయం పరిసరాల్లో చక్కర్లు కొట్టారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన అనంతరం రెండో ప్రయత్నంలో విమానం రాత్రి 8:35 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం సురక్షితంగా దిగడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల సమాచారం ప్రకారం, ఈ ఆలస్యానికి పూర్తిగా ప్రతికూల వాతావరణ పరిస్థితులే కారణమని తెలిపారు.