పేదలు, బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలి: బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వీవీ గౌడ్
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 5 2026: కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఓడి రమేష్ ను శనివారం కొత్తకోట సీఐ కార్యాలయంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వజగౌని వెంకటన్న గౌడ్ (వీవీ గౌడ్), పెబ్బేరు గౌడ సంఘం అధ్యక్షులు మాచర్ల శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ ఓడి రమేష్కు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వీవీ గౌడ్ మాట్లాడుతూ… కొత్తకోట సర్కిల్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసు అధికారులు సానుకూల దృక్పథంతో పరిశీలించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు. ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఎలాంటి అన్యాయం జరగకుండా, వారికి చట్టపరమైన రక్షణ కల్పిస్తూ న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలకు పోలీస్ శాఖపై నమ్మకం మరింత పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, బాధితుల సమస్యలను ఓపికగా విని, చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని వారు ఆకాంక్షించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని అన్నారు. సీఐ ఓడి రమేష్ గతంలో పెబ్బేరు ఎస్సైగా విధులు నిర్వహించిన సమయంలో ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, తన విధి నిర్వహణతో ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొందారని ఈ సందర్భంగా వీవీ గౌడ్, మాచర్ల శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కొత్తకోట సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో కూడా ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు, బీసీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొని సీఐ ఓడి రమేష్కు శుభాకాంక్షలు తెలిపారు.