POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 11:40 am Posted by : POLITICAL POWER

సీతారామ కాలవ మట్టిని అక్రమంగా తోడేస్తున్న మట్టి మాఫియా.. అడ్డుకున్న గిరిజనులపై దౌర్జన్యం ప్రజావాణిలో తహసిల్దార్ కు ఫిర్యాదు

 

పొలిటికల్ పవర్ దమ్మపేట, సెప్టెంబర్ 7: పెద్దగొల్లగూడెం పంచాయతీ పరిధిలో ప్రభుత్వ కాలవ మట్టిని యథేచ్ఛగా దోచేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చిన్నగొల్లగూడెం గిరిజనులు ఆరోపిస్తున్నారు.

అర్ధరాత్రి ఆపరేషన్:

చిన్నగొల్లగూడెం శివారులోని సీతారామ, ఇందిరా సాగర్ ప్రాజెక్టు కాలవల మట్టిని ఇదే గ్రామానికి చెందిన గుర్రం మల్లయ్య అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీ రాత్రి 11 గంటలకు జె.సి.బి.లు, ట్రాక్టర్లతో మట్టిని తోడుతుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు.

ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం:

గతంలో కూడా ఇదే వ్యక్తిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా మట్టి తరలిస్తున్న వాహనాలపై గానీ, అతనిపై గానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అతని ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయని వాపోయారు.

బెదిరింపులకు పాల్పడ్డ వైనం:

తాము అడ్డుకోవడంతో గుర్రం మల్లయ్య తమపై తీవ్ర దుర్భాషలాడుతూ “మీరేం చేసుకుంటారో చేసుకోండి” అంటూ బెదిరింపులకు దిగాడని, అనంతరం జె.సి.బి.ని, మిగతా ట్రాక్టర్లను వేరే మార్గం గుండా తరలించాడని బాధితులు తెలిపారు.

ఏజెన్సీ చట్టాలను ఉల్లంఘిస్తూ ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా విక్రయిస్తున్న వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, అక్రమ తోలకానికి ఉపయోగించిన వాహనాలను సీజ్ చేయాలని కోరుతూ గ్రామస్తులు ప్రజావాణిలో దమ్మపేట తహశీల్దార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు