వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపు
బిక్కవోలు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
శుక్రవారం బిక్కవోలు గ్రామంలో నిర్వహించిన వైఎస్సార్సీపీ కార్యకర్తల ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్త సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కార్యకర్తలకు ఐడీ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా పెండింగ్లో ఉన్న కార్డులను తదుపరి విడతలో త్వరలోనే అందజేస్తామని చెప్పారు. గ్రామ కన్వీనర్లు తమ పరిధిలోని కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఐడీ కార్డులను బాధ్యతాయుతంగా అందజేయాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత సమయం తక్కువగా ఉంటుందని, అందువల్ల ముందుగానే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించాలని సూచించారు. గ్రామాల వారీగా సామాజిక వర్గాలు, మహిళా రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకుని సమర్థులైన అభ్యర్థులను గుర్తించాలని కోరారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ పారదర్శకంగా అందించామని, అందుకే అప్పట్లో ధైర్యంగా గడప గడపకూ వెళ్లగలిగామని సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘మన ఇంటికి మన ప్రభుత్వం’ కార్యక్రమంపై ఆయన విమర్శలు చేశారు. గ్రామాల్లో పర్యటనలు తక్కువ సమయంలోనే ముగిస్తున్నారని, ప్రజల సమస్యలను తెలుసుకునే పరిస్థితి లేదని ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆరోగ్యశ్రీ, రైతు ఉచిత బీమా, డ్వాక్రా రుణాలు, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు పకడ్బందీగా అమలయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ప్రజలు వివిధ పథకాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. గతంలో రైతులకు ప్రీమియం లేకుండా బీమా సౌకర్యం కల్పించామని, ప్రస్తుతం ఎకరానికి రూ.600 నుంచి రూ.800 వరకు చెల్లించాల్సి వస్తోందని అన్నారు.
ప్రజలు రెండు ప్రభుత్వాల పాలనను బేరీజు వేసుకుంటున్నారని, కార్యకర్తలు ధైర్యంగా ప్రజల వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీల అమలు తీరును ప్రజలకు వివరించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ జంగా వీర వెంకట సుబ్బారెడ్డి, రొంగల అప్పాజీ, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి (బుజ్జి), బిక్కవోలు గ్రామ పార్టీ అధ్యక్షుడు వంగ రామకృష్ణారెడ్డి (అబ్బు), రాష్ట్ర బూత్ కమిటీ సెక్రటరీ బొడ్డు ముత్యాలరావు, బిక్కవోలు మండలంలోని వివిధ గ్రామాల కన్వీనర్లు, మాజీ వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.