పొలిటికల్ పవర్ ప్రతి నిధి శ్రీకాకుళం జిల్లా
స్థానిక పోరుకు సిద్ధం కావాలి: ధర్మాన కృష్ణదాస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. టెక్కలి ఆదిత్య కళ్యాణమండపంలో టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.



రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శ్రేణులను సమాయత్తం చేసేందుకు, కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. వైయస్ఆర్ సీపీ నాయకులకు ఇబ్బంది పెడుతున్న కూటమి నాయకులకు, అధికారుల పేర్లు నమోదు చేసే విధంగా జిల్లాలో డిజిటల్ బుక్ కమిటీ ఏర్పాటు చేశామని తెలియజేశారు. గ్రామ, వార్డు నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికీ ప్రచారం ప్రారంభించి జగనన్న ఇచ్చిన సంక్షేమ ఫలాలు గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రచార పుస్తకాలను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, జిల్లా పరిశీలకులు కుంభ రవిబాబు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, వివిధ నియోజకవర్గాల పరిశీలకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు పాల్గొన్నారు.