POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 7:51 pm Posted by : POLITICAL POWER

స్థానిక సమస్యల పరిష్కారంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలి: టీడీపీ నాయకులు

ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని కోరిన టీడీపీ నాయకులు

వర్షాకాలంలో వరద సమస్యల పరిష్కారానికి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచన

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక / పిఎన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టౌన్ అధ్యక్షుడు వినుకొండ రమేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం జిల్లా నాయకులు కేతినేని హరీష్ చంద్ర, సీనియర్ నాయకులు పోట్రు వెంకట రామారావు, టౌన్ మహిళా అధ్యక్షురాలు పలగాని రమ్య మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సత్తుపల్లిలోని సింగరేణి ప్రభావిత ప్రాంతాలైన ఎన్టీఆర్ నగర్, జవహర్ నగర్, వెంగళరావు నగర్, కొత్తూరు, కిష్టారం గ్రామాల్లో నివసిస్తున్న ప్రజలు సింగరేణి నుంచి వస్తున్న కాలుష్యం, భారీ శబ్దాలతో బ్లాస్టింగ్‌లు నిర్వహించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పేలుళ్ల కారణంగా అనేక ఇళ్లు దెబ్బతిన్నాయని, ఎన్నికల్లో గెలిచి మూడు సంవత్సరాలు సమీపిస్తున్నా ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే సత్తుపల్లి పరిసర ప్రాంతాల్లోని తామర చెరువు అలుగు నీరు కాకర్లపల్లి రోడ్డు, సిద్ధారం రోడ్డుపై చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని, గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితి ఎదురైందని గుర్తు చేశారు. అదే విధంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లూరు మోహన్, రాచర్ల చంద్రశేఖర్, ఉండవల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.