POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 9:31 pm Posted by : POLITICAL POWER

స్పీకర్‌ ను అవమానకరంగా మాట్లాడిన తాతా మధును వెంటనే బర్తరఫ్ చేయాలి -వనపర్తి కాంగ్రెస్ శ్రేణుల డిమాండ్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శివసేనరెడ్డి ల ఆదేశాల మేరకు మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో భారీ నిరసన చేపట్టి తాతా మధు తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని కించపరిచేలా మాట్లాడటం తాతా మధు అహంకారానికి పరాకాష్ట అని, దళితులను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సహించేది లేదని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. తాతా మధును తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేసి, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్పీకర్‌పై ఇష్టానుసారంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదని, అధికార అహంకారంతో నోరు పారేసుకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తాతా మధు వ్యాఖ్యలను సమర్థిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు దళిత సమాజానికి, సభ్య సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి హాజరుకాని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్‌పై కూడా శాసనసభ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. తాతా మధుపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి బీఆర్‌ఎస్‌కు ప్రజాక్షేత్రంలో తగిన సమాధానం చెబుతామని కాంగ్రెస్ శ్రేణులు హెచ్చరించాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, జర్నల్ సెక్రెటరీ, అధికార ప్రతినిధి కోళ్ల వెంకటేష్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్. వనపర్తి పట్టణ అధ్యక్షులు కదిరి రాములు, మార్కెట్ యార్డ్ మాజీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వాకిటి ఆదిత్య, వనపర్తి పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్దలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.