కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాపాడాలి
— బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి
పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 16 2026: కేసీఆర్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అమలు చేసిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే కారణమని వనపర్తి జిల్లా పెద్దమందడి మండల బీఆర్ఎస్ నాయకుడు అల్వాల వెంకట్ రెడ్డి ఆరోపించారు.పేదల సంక్షేమానికి సంబంధించిన కీలకమైన పథకాల విషయంలో ప్రభుత్వం సకాలంలో కోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోవడం తీవ్ర నిర్లక్ష్యమని ఆయన విమర్శించారు. పథకాలపై న్యాయపరమైన అంశం కోర్టు ముందుకు వచ్చిన వెంటనే ప్రభుత్వం అప్రమత్తమై, సమర్థవంతంగా తన వాదనలు వినిపించి పథకాలకు రక్షణ కల్పించాల్సి ఉందన్నారు. అయితే కౌంటర్ దాఖలులో జాప్యం చేయడం వల్లే హైకోర్టు మధ్యంతర స్టే విధించే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.హైకోర్టు స్టేతో పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల వివాహాలకు అందాల్సిన ఆర్థిక భరోసాపై అనిశ్చితి నెలకొందని అల్వాల వెంకట్ రెడ్డి అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు రాష్ట్రంలోని వేలాది పేద కుటుంబాలకు అండగా నిలిచాయని తెలిపారు. పేదల కోసం రూపొందించిన సంక్షేమ పథకాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు.ప్రభుత్వం వెంటనే స్పందించి కోర్టులో బలమైన వాదనలు వినిపించి, స్టే ఎత్తివేయించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.అదేవిధంగా, కల్యాణలక్ష్మితో పాటు ప్రతి ఆడబిడ్డ వివాహానికి తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని అల్వాల వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా పేద ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.