POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 04 September 2026, 4:00 pm Posted by : POLITICAL POWER

లక్షెట్టిపేటలో వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు,

కుంకుమ పూజలు.

ఘనంగా నిర్వహించిన మహిళా ఆర్యవైశ్య సంఘం

సెప్టెంబర్ 3:   పొలిటికల్ పవర్ న్యూస్ 9టీవీ తెలంగాణ స్టేట్ బ్యూరో సతీష్

లక్షెట్టిపేట పట్టణంలోని బీట్ బజార్ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శుక్రవారం పట్టణ మహిళా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు, కుంకుమ పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పవిత్ర వేడుకల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్షెట్టిపేట పట్టణ మహిళా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు నరేందుల సాహితీ మాట్లాడుతూ ప్రతి ఏటా వాసవి మాత ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకుంటున్నామని, ఈ ఏడాది కూడా మహిళలందరి సహకారంతో వేడుకలను ఘనంగా జరుపుకున్నట్లు తెలిపారు. హిందూ ధర్మంలో అమ్మవారికి చేసే కుంకుమ పూజ అత్యంత శక్తివంతమైనదని, ఈ పూజలు ఆచరించడం ద్వారా మహిళలకు అఖండ సౌభాగ్యం కలుగుతుందని, ఆ సౌభాగ్యమే మహిళలకు శ్రీరామరక్ష అని ఆమె పేర్కొన్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేసి, భక్తిశ్రద్ధలతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షురాలు నరేందుల సాహితి, ప్రధాన కార్యదర్శి పల్లెర్ల ఆరతి, కోశాధికారి కాసం స్వప్న, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎనగందుల శరణ్య, గౌరవ సలహాదారులు చెట్ల రమ్య, ఉత్తూరి రజిత ఉపాధ్యక్షులు సామ లావణ్య, చిట్టు మల్ల విజయ, రావికంటి సుమలత, గుండ లతా శ్రీ, సిదురాల సోనీ, జైన స్రవంతి, సామ జయ, ఆలయ కమిటీ సభ్యులు పలువురు సంఘం సభ్యులు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.