పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో భాజ శేఖర్ ఆగస్టు 17 2026: హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని పలు భూములను నిషేధిత 22-ఏ జాబితాలో చేర్చి, రిజిస్ట్రేషన్లకు ఆటంకాలు సృష్టిస్తున్నారంటూ ప్రభుత్వ అధికారులపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 22-ఏ నిబంధనలను అడ్డుపెట్టుకుని కొందరు ప్రభుత్వ పెద్దలు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తమ ఆస్తులను విక్రయించేందుకు ప్రయత్నించిన సమయంలో భూములు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలుసుకుని పలువురు యజమానులు ఆందోళనకు గురవుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్లో నిర్మాణం పూర్తయిన ఓ అపార్ట్మెంట్ను కూడా 22-ఏ జాబితాలో చేర్చడంతో వివాదం తలెత్తినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై బిల్డర్ హైకోర్టును ఆశ్రయించగా, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు కొనసాగించాలంటూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంటున్నారు. అయితే కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వడం లేదని బిల్డర్ ఆరోపిస్తున్నారు. రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇవ్వాలంటే రూ.50 కోట్లు చెల్లించాలని ప్రభుత్వ పెద్దలు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పటికే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం రూ.10 కోట్లు చెల్లించానని, ఇక అంత మొత్తాన్ని చెల్లించే పరిస్థితి తనకు లేదని బిల్డర్ వాపోయినట్లు సమాచారం. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తున్నారని ఆరోపిస్తూ బిల్డర్ హైకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో 22-ఏ నిబంధనల అమలు, కోర్టు ఆదేశాల అమలు, అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరగాలని పలువురు కోరుతున్నారు.