POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 9:28 pm Posted by : POLITICAL POWER

పొలిటికల్ పవర్ ప్రతినిధి తాడేపల్లి

గ్రూప్‌–1, గ్రూప్‌–2 అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని వైయస్‌ జగన్‌కు వినతి

గ్రూప్‌–1, గ్రూప్‌–2 ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరుతూ నిరుద్యోగ అభ్యర్థులు మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ. రవిచంద్ర ఆధ్వర్యంలో అభ్యర్థులు శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఫేజ్‌–2 జాబ్‌ క్యాలెండర్‌లో వయోపరిమితిని కేవలం రెండేళ్లు మాత్రమే సడలించడం వల్ల అనేక మంది అభ్యర్థులకు అవకాశం లేకుండా పోతుందని వారు తెలిపారు. రాష్ట్రంలో రెగ్యులర్‌గా ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయారని వివరించారు. 2018 నుంచి 2026 మధ్య గ్రూప్‌–1, గ్రూప్‌–2, డీఎస్సీ నోటిఫికేషన్లు పరిమితంగా రావడంతో తమకు నష్టం జరిగిందని పేర్కొన్నారు.

ప్రస్తుతం వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు మాత్రమే పెంచారని, దీనిని ఒక్కసారి ఈ జాబ్‌ క్యాలెండర్‌కు వన్‌టైమ్‌ సడలింపుగా 47 ఏళ్లకు పెంచాలని కోరారు. తెలంగాణలో కూడా గతంలో వయోపరిమితి సడలింపులు ఇచ్చిన విషయాన్ని వారు ప్రస్తావించారు.

గతంలో ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచిన సందర్భంలో నిరుద్యోగ అభ్యర్థుల వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని గతంలో టీడీపీ నేతలు, టీడీపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు డిమాండ్‌ చేసిన విషయాన్ని కూడా అభ్యర్థులు శ్రీ వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం సెప్టెంబర్‌ 15న గ్రూప్‌–1 నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో వయోపరిమితి అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.

లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. వారి వినతిపై శ్రీ వైయస్‌ జగన్‌ స్పందించి, సమస్యను పరిశీలించి అవసరమైన విధంగా ప్రస్తావిస్తామని తెలిపారు.

శ్రీ వైయస్‌ జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎ. రవిచంద్ర, నిరుద్యోగ అభ్యర్థులు ఆర్‌. శ్రీనివాసరావు, కె. కిరణ్‌కుమారి, కె. రాజ్‌కోటి తదితరులు ఉన్నారు.